sathyavelugu.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 10:46 pm Digital Edition : SATHYA VELUGU

నారా లోకేష్ పిలుపు: ప్రతి వారం ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శించాలి

అమరావతి: రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష పాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని సన్నిహితులు సూచించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ సవాలును ఇష్టపూర్వకంగా తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ప్రతి మండలానికి కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు. ఆ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని కోరారు. అదేవిధంగా, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడేలా చేయాలని ఆకాంక్షించారు.
ప్రతివారం ఒక ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యేలు స్వయంగా సందర్శించి, అక్కడి మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై సమీక్ష చేయాలని మంత్రి సూచించారు. సందర్శనల అనంతరం అందించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
విద్యా వ్యవస్థ అభివృద్ధి కేవలం మంత్రి లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు—అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే స్థిరమైన సంస్కరణలు సాధ్యమవుతాయని లోకేష్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాలకు రాష్ట్రానికి అవసరమైన నాణ్యమైన మానవ వనరులను తయారు చేయాలంటే పాఠశాలల స్థాయిలోనే మార్పులు ప్రారంభించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా మార్చడం ద్వారా విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యమని, దీనికి ప్రజాప్రతినిధుల సహకారం కీలకమని మంత్రి స్పష్టం చేశారు.