న్యూఢిల్లీ: ప్రధాని విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి జరిగిన వ్యయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వివరాలు వెల్లడించింది. 2021 నుంచి ప్రధాని విదేశీ పర్యటనల కోసం మొత్తం రూ.550 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపింది.
రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, 2025లో ఇప్పటివరకు 23 విదేశీ పర్యటనలు నిర్వహించగా, వాటికి సంబంధించిన విమానాల నిర్వహణ, ప్రయాణ ఏర్పాట్ల కోసం రూ.187 కోట్ల వరకు వ్యయం జరిగినట్లు పేర్కొంది.
అలాగే, 2021 నుంచి ఇప్పటివరకు ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన విమాన ప్రయాణాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర లాజిస్టిక్ సేవల కోసం మొత్తం రూ.550 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు రూ.74 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కూడా కేంద్రం వివరించింది.
ప్రధాని విదేశీ పర్యటనలకు అయ్యే ఖర్చుల్లో ప్రత్యేక విమాన సేవలు, భద్రతా ఏర్పాట్లు, అధికార ప్రతినిధుల ప్రయాణం, ఇతర నిర్వహణ వ్యయాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ వివరాలు పార్లమెంట్లో ప్రభుత్వ అధికారిక సమాధానం ద్వారా వెలుగులోకి వచ్చాయి.