తిరుపతి : గూడూరు పట్టణంలో 14 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఈ సమస్యను కేంద్ర రైల్వే శాఖ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి, నిధుల మంజూరు కోసం చేసిన కృషికి సానుకూల ఫలితం లభించింది.
2008లో 99-ఏ, 99-బీ లెవల్ క్రాసింగుల స్థానంలో ఆర్ఓబీ నిర్మాణానికి అనుమతి లభించగా, 2011లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిధుల కొరత తదితర కారణాలతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో గూడూరు ఒకటి, రెండో పట్టణాల ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ గురుమూర్తి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్నను స్వయంగా కలిసి గూడూరు ఆర్ఓబీ ఆవశ్యకతను వివరించారు. గూడూరు పట్టణ ప్రజలకు మాత్రమే కాకుండా ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు కూడా ఈ ఆర్ఓబీ ఎంతో కీలకమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా, నిధులు విడుదల కాకపోవడం వల్ల పనులు నిలిచిపోయిన విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ఎంపీ గురుమూర్తి పలుమార్లు వినతిపత్రాల ద్వారా తీసుకెళ్లారు.
ఆర్ఓబీ నిర్మాణం వల్ల గూడూరు ప్రజలకు కలిగే ప్రయోజనాలు, పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, అత్యవసర సేవలకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, మిగిలిన పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎంపీ గురుమూర్తి నిరంతర ప్రయత్నాలకు స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మిగిలిన పనులను పూర్తి చేసేకి టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై ఆర్ఓబీ మిగిలిన పనులను రైల్వే శాఖ పర్యవేక్షించనుంది.
ఇప్పటికే రైల్వే గేట్ల నుంచి సొసైటీ ప్రాంతం వరకు సుమారు 80 శాతం నిర్మాణం పూర్తయింది. మంజూరైన నిధులతో సొసైటీ ప్రాంతం నుంచి ఎస్ఎన్జీ పాఠశాల వరకు రోడ్డు, రెండో పట్టణంలోని సిరామిక్ కళాశాల వైపు ఒక భాగం, అడివయ్య కాలనీ వైపు మరో భాగం నిర్మాణాలను పూర్తి చేయనున్నారు.
ఎంపీ గురుమూర్తి చొరవతో ఆర్ఓబీ పనులకు మార్గం సుగమం కావడంతో గూడూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయితే గూడూరు రెండు పట్టణాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. గూడూరు ఆర్ఓబీతో పాటు గూడూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి, వెంకటగిరి, నాయుడుపేట, వెందోడు రైల్వే స్టేషన్లలో ముఖ్య రైళ్లకు స్టాపింగ్స్ కల్పించడం వంటి అంశాలపై కూడా ఎంపీ గురుమూర్తి కేంద్ర రైల్వే శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రజల అవసరాల కోసం కృషి చేస్తున్నారు.