కడప, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం కడప నగరంలోని సుల్తాన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీరా రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నగేష్ పేర్కొన్నారు. పార్టీపై ఆసక్తి ఉన్న సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, యువత పార్టీలో చేరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా నాయకులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.