sathyavelugu.com
Date of Publish : 04 September 2026, 9:58 pm Posted by : KUMPATI SURESH

RTI దరఖాస్తుపై అధికారుల నిర్లక్ష్యం మూడు నెలలు గడిచినా సమాచారం ఇవ్వలేదని ఆరోపణ

చిల్లకూరు, సెప్టెంబర్ 4: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు నిర్ణీత గడువులో సమాచారం అందించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్. మస్తానయ్య ఆరోపించారు.

చిల్లకూరు మండలానికి సంబంధించి 05-06-2026న RTI దరఖాస్తు సమర్పించినట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని వివిధ పంచాయతీల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన వివరాలు, ఆక్రమణలకు సంబంధించి జారీ చేసిన సెక్షన్ 6, సెక్షన్ 7 నోటీసులు, సంబంధిత Assessment Numbers, పేర్లు, చిరునామాలు తదితర సమాచారాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు FSC (Food Security Card), EWS కార్డులు, OBC కార్డులకు సంబంధించిన వివరాలు కూడా RTI ద్వారా కోరినట్లు తెలిపారు.

RTI చట్టం ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసి సుమారు మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని మస్తానయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం కోరినప్పుడు అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాల్సి ఉంటుందని, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలంటే RTI చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

చిల్లకూరు మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వాటిపై తీసుకున్న చర్యలు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్డుల వివరాలపై సమాచారం కోరినప్పటికీ స్పందించకపోవడం పట్ల ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు.

RTI దరఖాస్తులకు సమయానికి సమాచారం అందించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులకు చట్టబద్ధంగా అందాల్సిన సమాచారాన్ని వెంటనే అందించాలని మస్తానయ్య డిమాండ్ చేశారు.

ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండేలా RTI చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆయన కోరారు.