sathyavelugu.com
Date of Publish : 07 September 2026, 10:36 pm Posted by : KUMPATI SURESH

హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు ,ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా

నాయుడుపేట, సెప్టెంబర్ 7 (సత్య వెలుగు): నాయుడుపేట పట్టణ పరిధిలోని విన్నమాల వద్ద 2021లో జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ గూడూరు అదనపు జిల్లా న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. 2021 నవంబర్ 17న విన్నమాల వద్ద రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో అరవ శ్రీనివాసులు, శీనయ్యపై ముగ్గురు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై అప్పటి నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అప్పటి సీఐ వై.వి. సోమయ్య దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పేర్నాటి సాగర్, పేర్నాటి బెనహర్, పేర్నాటి అనిల్లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలు, నాయుడుపేట డీఎస్పీ సూచనల మేరకు పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత్ కుమార్ వాదనలు వినిపించగా, సాక్షులను కోర్టుకు హాజరుపరచడంలో నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తదితరులు సహకరించారు.