sathyavelugu.com
Date of Publish : 07 September 2026, 9:59 pm Posted by : KUMPATI SURESH

శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతానికి కొత్త రహదారి

వేదం పెద్దమిట్ట కండ్రిగ వరకు 1.04 కి.మీ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం.. రూ.1.05 కోట్ల నిధులు మంజూరు

శ్రీకాళహస్తి: పల్లెటూళ్లే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల అభివృద్ధికి మెరుగైన రహదారి సదుపాయాలు ఎంతో కీలకమని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించే దిశగా మరో ముందడుగు పడింది.

శ్రీకాళహస్తి–ముసలిపేడు రోడ్డు నుంచి వేదం పెద్దమిట్ట కండ్రిగ వరకు కొత్తగా గ్రామీణ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 1.04 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద రూ.1.05 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రత్యేక చొరవతో ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. నిత్యం ప్రయాణించే గ్రామ ప్రజలు, విద్యార్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను త్వరగా చేరుకునే అవకాశం కలుగుతుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో రహదారులు దెబ్బతినడంతో ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామీణ ప్రజలకు ఈ కొత్త రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు కూడా మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలకమని, ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.