దొరవారిసత్రం,సత్య వెలుగు న్యూస్ : దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామ ప్రజలకు తారు మిక్సింగ్ ప్లాంట్తో వాయు కాలుష్య ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై–కలకత్తా జాతీయ రహదారికి సమీపంలో వాసమ్మ ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి దట్టమైన పొగ వెలువడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
నెలబల్లి గిరిజన కాలనీ, హరిజనవాడకు సమీపంలోనే ప్లాంట్ ఉండటంతో తారు మిక్సింగ్ సమయంలో వెలువడే పొగ, ధూళి గాలితో గ్రామం వైపు వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు సైతం పొగను పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, స్థానిక సంస్థల అనుమతులు, ఇతర నిబంధనలు పూర్తిగా పాటించారా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ప్లాంట్ నుంచి వెలువడుతున్న పొగకు సంబంధించి సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని నెలబల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.