sathyavelugu.com
Date of Publish : 15 September 2026, 8:35 pm Posted by : KUMPATI SURESH

కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు

చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):
చౌడేపల్లి మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో వీధివీధినా ప్రత్యేకంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసి, గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం నుంచే భక్తులు గణపయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో భక్తులు మండపాలకు చేరుకుని బొజ్జ గణపయ్యను దర్శించుకుని తొలి పూజలు అందుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

10 నుంచి 18 అడుగుల వరకు గణపయ్య విగ్రహాలు

చౌడేపల్లి పట్టణంలోని నేతాజీ నగర్, బజారు వీధి, మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, సంత గేటు, బత్తలాపురం రోడ్డు, గాంధీ వీధి, రామస్వామి మండపం తదితర ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో 10 అడుగుల నుంచి 18 అడుగుల వరకు గణపయ్య విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక అలంకరణలతో ఉత్సవాలను నిర్వహించారు.

భక్తులకు అన్నదాన కార్యక్రమాలు

వినాయక మండపాల వద్ద నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతి, ప్రసాద పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. పలుచోట్ల భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.