చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):
చౌడేపల్లి మండలంలోని పంచాయతీ కేంద్రం శెట్టిపేటలోని మోక్ష గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత మాదిరాజు లక్ష్మణరాజు, పతిరాజు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
వేద పండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి తొలి పూజ నిర్వహించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులు చేపట్టారు. అనంతరం ఆలయ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
రూ.1,49,116కు గణపతి లడ్డూ వేలం
వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన గణపతి లడ్డూకు భారీ గిరాకీ ఏర్పడింది. నిర్వహించిన వేలంపాటలో రెడ్డి అనే భక్తుడు రూ.1,49,116కు లడ్డూను దక్కించుకున్నారు. అదేవిధంగా కుడుముల హారాన్ని సురేష్ రూ.32 వేలతో వేలంలో దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చౌడేపల్లి ప్రాంతానికి చెందిన భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
భక్తులకు అన్నదానం
వినాయక చవితి సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు, భోజన వసతి కల్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో శెట్టిపేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


