నాయుడుపేట, సెప్టెంబర్ 7 : ఓజిలి మండలం అత్తివరం గ్రామంలోని ఇన్టచ్ పరిశ్రమలో 29 మంది స్థానిక కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సోమవారం కార్మికులతో కలిసి పరిశ్రమ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేరడార్ అధ్యక్షులు ఎస్.కె. అబ్దుల్లా మాట్లాడుతూ స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారని ఆరోపించారు. స్థానిక కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఇంక్రిమెంట్లు, వేతనంతో కూడిన సెలవులు, ట్రావెల్ చార్జీలు వంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. పరిశ్రమలో ప్రమాదాలు జరిగినప్పుడు డ్యూటీ డాక్టర్, అంబులెన్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు.
స్థానిక కార్మికురాలు ప్రసన్న నాగమ్మ మాట్లాడుతూ పరిశ్రమ నుంచి కలుషిత నీటిని చెరువుల్లోకి విడుదల చేయడం వల్ల పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. దుమ్ము, కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలగించిన 29 మంది స్థానిక కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుని, చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అనురాధ, గీత, కల్పన, మంజులమ్మ తదితరులు పాల్గొన్నారు.


